కరోనాతో జాగ్రత్త

పొరుగున ఉన్న చైనాలో ప్రాణాంతక కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో భారత్ అప్రమత్తమైంది. తెలంగాణలోని శంషాబాద్ విమానాశ్రయంతోపాటు దేశంలోని ఏడు ప్రధాన విమానాశ్రయాల్లో థర్మల్ స్క్రీనింగ్ కేంద్రాలను ఏర్పాటుచేసింది. ఇప్పటివరకు 60 విమానాల్లో వచ్చిన 12,828 మంది ప్రయాణికులకు స్క్రీనింగ్ నిర్వహించామని, అయితే ఎలాంటి పాజిటివ్ కేసు నమోదుకాలేదని కేంద్ర వైద్య శాఖ కార్యదర్శి ప్రీతిసూడాన్ తెలిపారు. వైరస్ వ్యాప్తి, సన్నద్ధతపై ఆమె గురువారం సమీక్ష నిర్వహించారు. ప్రయాణికులకు ఇప్పటికే ట్రావెల్ అడ్వైజరీని జారీచేసిన కేంద్రం.. విమానాశ్రయాల్లో సన్నద్ధతపై సమీక్ష నిర్వహించి పటిష్ఠ చర్యలు చేపట్టాలని తెలంగాణతోపాటు మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, కర్ణాటక ప్రభుత్వాలకు లేఖ రాసింది. కాగా, సౌదీ అరేబియాలోని అల్ హయత్ దవాఖానలో పనిచేస్తున్న కేరళ నర్సుకు కరోనా వైరస్ సోకింది. సుమారు 100 మంది భారతీయ నర్సులకు (కేరళకు చెందినవారే అత్యధికులు) స్క్రీనింగ్ నిర్వహించగా, ఒక నర్సుకు వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిందని కేంద్ర ప్రభుత్వం గురువారం వెల్లడించింది. బాధిత నర్సుకు అసీర్ జాతీయ దవాఖానలో చికిత్స అందిస్తున్నట్లు విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ తెలిపారు. అయితే ఆ వైరస్ చైనాలో వ్యాపించిన కరోనా వైరస్ కాదని, వేరే జాతికి చెందిన కరోనా వైరస్  అని జెడ్డాలోని భారత కాన్సులేట్ స్పష్టం చేసింది. మరోవైపు కేరళ సీఎం విజయన్ విదేశాంగ మంత్రి జైశంకర్‌కు లేఖరాశారు. సౌదీ ప్రభుత్వాన్ని సంప్రదించి బాధిత నర్సుకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చూడాలని విజ్ఞప్తిచేశారు.